చండీగఢ్: దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా త్రిపుల్ తలాక్ అంశం ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి కేంద్రం గట్టిగానే ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణాతీతం. కేవలం తలాక్ అని మూడు సార్లు చెప్పడంతోనూ, పేపర్ పై రాయడంతోనూ, లేక మెసెజ్ పెట్టడంతోనూ భార్యలను అర్ధాంతరంగా వదిలించుకుంటున్నారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన భర్తకు తలాక్ చెప్పి ప్రియుడైన మేనల్లుడితో కలిసి వెళ్లిపోయింది. హర్యానాలోని ఉనేడి గ్రామంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ పేపర్పై మూడుసార్లు తలాక్ అని రాసి మేనల్లుడితో ఆమె వెళ్లిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. షాజియా అనే మహిళ భర్తకు రాసిన లేఖలో ఇలా ఉంది. ‘‘నేను నా ఇష్టపూర్వకంగా తలాక్ చెబుతున్నా. వివాహం అయినప్పటి నుంచి నువ్వు నన్ను హింసిస్తూనే ఉన్నావు. అందుకే వెళ్లిపోతున్నా. తాగి వచ్చిన ప్రతిసారి నన్ను కొడుతున్నావు. ఇక భరించడం నా వల్ల కాదు. నీకు తలాక్ చెబుతున్నా’’ అని ఆమె పేర్కొంది. తలాక్ విషయంలో తనపై ఎవరి ఒత్తిడీ లేదని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని షాజియా పేర్కొనడం గమనార్హం. భర్తకు తలాక్ చెప్పిన ఆమె అవివాహితుడైన తన మేనల్లుడితో వెళ్లిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.