కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మొదట తేలికగా తీసుకుందని.. తరువాత చేతులెత్తేసిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కాబట్టి ప్రజలంతా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. తీరా తీవ్రత పెరిగాక చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అధైర్య పడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు అని చంద్రబాబు పేర్కొన్నారు.
గుంటూరు జీజీహెచ్లో మృతదేహాలు అలానే ఉండిపోవటం బాధాకరమని చంద్రబాబు దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వైరస్ మృతదేహాలపై ఎంత సేపు ప్రభావం ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్ ప్రకారం వాటికి దహన సంస్కారాలు నిర్వహించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా సోకిన వ్యక్తిని చెత్త తరలించే వాహనంలో ఆసుపత్రికి తరలించటం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నారు. మద్యం, ఇతర వ్యసనాలు మానేయాలని చంద్రబాబు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారన్నారు.
ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉందని గుర్తించాలన్నారు. ప్రభుత్వం కూడా హోమ్ క్వారంటైన్, టేలిమెడిసిన్పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.